Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, న‌వంబ‌ర్ 12,2021: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. లోక కళ్యాణార్థం15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుంచి పునరుద్ధరించి నిర్వహిస్తున్నారు. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చిస్తుంటారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేస్తారు.

ఈ ఏడాది 8 టన్నుల పుష్పాలు, పత్రాలు…

పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి 3 టన్నులు, కర్ణాటక రాష్ట్రం నుంచి 4 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి ఒక‌ టన్ను పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఇటీవ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మైన పుష్పాల‌ కోసం తిరుమల బాట గంగమ్మ ఆల‌యం స‌మీపంలో అభివృద్ధి చేసిన శ్రీ‌వారి పుష్ప ఉద్యాన‌వ‌నం నుంచి150 కేజీల పుష్పాలు ఈ మహోత్సవంలో వినియోగించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేస్తారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చిస్తారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠిస్తారు.