Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,డిసెంబ‌ర్25, 2021: తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాల నివార‌ణ కోసం వాహ‌నాల వేగ‌నియంత్ర‌ణ కోసం స్పీడ్ గ‌న్‌లు, స్పీడ్ బ్రేక‌ర్లు ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నిర్ణీత వేగం నిబంధ‌న‌ను ఉల్లంఘించే వాహ‌నాల‌ను స్పీడ్ గ‌న్‌ల ద్వారా గుర్తించి జ‌రిమానాలు విధించాల‌న్నారు. అధికారుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న తిరుమ‌ల రెండో ఘాట్ రోడ్డు, శ్రీ‌వారి మెట్టు మ‌ర‌మ్మతు ప‌నుల‌ను త్వ‌ర‌లో పూర్తి చేయాల‌న్నారు. ఘాట్ రోడ్ల‌లో డ్రోన్ల ద్వారా గుర్గావ్‌కు చెందిన భూమి డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ నిర్వ‌హించిన జియ‌లాజిక‌ల్ స‌ర్వే, టోపోగ్ర‌ఫి స‌ర్వే నివేదిక‌ల‌ను జ‌న‌వ‌రి 10వ తేదీలోగా అందించాల‌న్నారు. ఈ నివేదిక‌ల‌ను అమృత యూనివ‌ర్సిటీలోని నిపుణుల‌కు పంపి వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. మోకాలిమెట్టు నుంచి జిఎన్‌సి వ‌ర‌కు ఒక‌టో ఘాట్ రోడ్డు నాలుగు లైన్లుగా విస్త‌రించే ప‌నుల‌కు సంబంధించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అన్న‌మ‌య్య మార్గం అభివృద్ధిపై ఈవో అధికారుల‌తో చ‌ర్చించారు.