365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుమల 22, ఆగస్టు 2021: పర్యావరణ పరిరక్షణ, ప్రాణకోటి మనుగడకు హాని కలిగించని విధంగా డిఆర్ డిఓ తయారు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రాన్ని ఆదివారం తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ప్రారంభించారు. డి ఆర్ డి ఓ చైర్మన్ సతీష్ రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ కౌంటర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లోని క్షిపణి ప్రయోగ కేంద్రంలోని అడ్వాన్స్ సిస్టమ్స్ లేబొరేటరీ అనేక రకాల ప్రయోగాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం, పశువులకు ప్రాణ హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్ల కు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్ల తయారీపై పరిశోధనలు చేసిందన్నారు.మొక్కజొన్న వ్యర్థాలతో సంచులు తయారుచేసి, వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి మేలు కలుగుతుందని పరిశోధనలు చేసిందన్నారు. ప్లాస్టిక్ కవర్లకు ఇది పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం అని నిరూపణ అయ్యాక వీటి తయారీకి ఆమోదం తెలిపిందన్నారు. ఈ కవర్లను పశువులు తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఇవి 90 రోజుల్లోనే పూర్తిగా భూమిలో కలసి పోతాయని ఆయన చెప్పారు. ఇవి పాలిథిన్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు. ప్రసాదాల పంపిణీ కోసం బట్ట, జ్యుట్ బ్యాగులు విక్రయిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ మంత్ర సంస్థ పర్యావరణ హిత కవర్లు విక్రయిస్తోందని తెలిపారు. డీఆర్డీఓ తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు తిరుమలలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. భక్తుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి లభించిన వెంటనే ఈ కవర్లు మరింతగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. టీటీడీ సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి, డిఆర్ డిఓ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం ఆర్ ఎం బాబు, వీర బ్రహ్మం, ఆలయ డిప్యూటి ఈవో రమేష్, డిప్యూటి ఈవో లోకనాథం, విజి ఓ బాలి రెడ్డి, ఎకోలాస్టిక్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్డిఓ అధికారులు ఈవో, అదనపు ఈవో, సివిఎస్వో లను సన్మానించారు.