Thu. Apr 18th, 2024
bjp-chief-bandi-sanjay

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి,15,2022: తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌ షిప్‌లను వెంటనే చెల్లించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండేళ్ల నుంచి బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడంతో ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు రూ.3 వేల కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టలేక విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయన్నారు.

దాదాపు14 లక్షల మంది బీసీ విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సంజయ్ తెలిపారు.ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు చెల్లించకపోవడంతో బీటెక్‌, బీఈ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాసిన బహిరంగ లేఖలో సంజయ్‌ వివరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు పూర్తిగా చెల్లించేవారని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది.10వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు మాత్రమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి ఫీజులు చెల్లిస్తోందని, 10 వేలకు పైగా ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తోందని సంజయ్ ఆరోపించారు.

దీంతో మిగిలిన ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. బీసీ విద్యార్థుల ఫీజులు, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిఒ నెం: 18ని సవరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వంటి ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఐఐటి తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల పూర్తి ఫీజులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.