Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,మే 27, 2023: తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను క‌టాక్షిచారు.

బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో స్వామివారిని స్తుతిస్తూ, మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. విశ్రాంతికి సుఖనిద్రకు కారణమవుతున్నాడు.

తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు. వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ రవికుమార్, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.