Fri. Apr 19th, 2024
CPR-training-program-_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నిజామాబాద్, మార్చి 25, 2023: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుంచి కాపాడేందుకు వీలుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి అందిస్తున్న సీ.పీ.ఆర్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.

ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సీ.పీ.ఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సీ పీ ఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే, ఏమాత్రం తాత్సారం చేయకుండా సీపీఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు.

ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

CPR-training-program-_365

ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీ, బోధన్ లోని రాకాసిపెట్, ఆర్మూర్, మెండోరా, రుద్రూర్ లలోని ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా మహిళా వైద్యులు, సిబ్బందిచే ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా ఎనిమిది రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి, అవసరమైన వారికి జీజీహెచ్ లో చికిత్సలు చేయిస్తారని అన్నారు.

CPR-training-program-_365

రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం ఇటీవలే నిజామాబాద్ జీజీహెచ్ లో 30 లక్షల రూపాయల విలువ చేసే మామోగ్రమ్ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలితా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు