Thu. Apr 18th, 2024
dhanurmasam

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్16,2022: హైదవ ధర్మంలో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. శ్రవణం, కార్తీకం, ధనుర్మాసాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అటువంటి వాటిల్లో సంప్రదాయంగా అనుసరించే మాసాల్లో ధనుర్మాసం ఒకటి. నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం..

ఇది దక్షిణాయనానికి చివరిలోనూ, ఉత్తరాయణానికి ప్రారంభంలోనూ వచ్చే పవిత్రమాసం. దైవాన్ని అర్చించుకునే అనువైన మాసంగా ధనుర్మాసానికి పేరుంది.

మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. తెలుగునాట సాంస్కృతిక వికాసంలో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మాసం ప్రారంభరోజు నుంచి చివరి రోజు వరకూ ఇంటిముందు కళ్లాపులు, రంగవల్లులు, గొబ్బెమ్మలతో మహిళలు, కన్నెపిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు.

dhanurmasam

ధనుర్మాసం ఉభయసంధ్యల్లోనూ ‘ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల దరిద్రం తొలగి మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ నెల రోజులపాటూ వైష్ణవాలయాల్లో ఉదయం పూట అర్చన. తరువాత స్వామికి నివేదించే ప్రసాదాన్ని విశేషించి చిన్న పిల్లలకు పెడుతుంటారు.

దీనికే బాలభోగం అని జనవ్యవహారంలో పేరుంది. ద్రవిడ సంప్రదాయాన్ని అనుసరించి ధనుర్మాసంలో ప్రతీరోజూ ‘ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం చేస్తారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే సుప్రభాత ” పఠనానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు.

అలాగే స్వామికి చేసే సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలను వాడుతుంటారు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినది మొదలు భోగి పండుగ దాకా వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి శ్రీకృష్ణభగవానుణ్ణి అర్చించింది.

అవ్యక్తంగా ఉండే దైవం వ్యక్తరూపంలో కనుపించేది ప్రకృతిలోనే కదా! అందువలన శోభాయమానంగా కనిపించే ప్రకృతిలో ఈశ్వరుడు విశేషంగా ప్రకటిత నవుతాడు.

ఎక్కడ భగవదారాధనలో సహజ రమణీయమైన ప్రకృతిశోభ ఇనుమడిస్తుందో అక్కడ దైవత్వం తొణికిసలాడుతుంది. తృప్తిగా, సంతోషంగా ఉండే మనసులోని ఆనందం పరమానందమవుతుంది. కాలగమనంలోని ఒక అందమైన మజిలీ ధనుర్మాసం.

dhanurmasam

అసలు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనూరాశిలో ఉన్న మాసం. తర్వాత ఆదిత్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మకర సంక్ర మణంలో వచ్చే పెద్ద పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి శోభ అత్యంత మనోహరం. నిత్యం తన ప్రకాశంతో లోకాన్ని ప్రకా శింపచేసే భానుడు మరింత తేజోవంతంగా దర్శనమిచ్చేకాలమది.

సంక్రాంతికి వెనుకవున్న ముప్ఫైరోజులను ధనుర్మాసమంటారు. మార్గశిర మాసంలో సూర్యుడు ధనూరాశిలో ఉన్నప్పుడు ధనుస్సుపట్టడం అంటారు. ఈ ధనుస్సంక్రమణం షడశీతి పుణ్యకాలం. మిధున కన్యా ధనుర్మాః రాశు లలోని సూర్యసంక్రాతిని షడశీతి అంటారని నిఘంటువు చెబుతోంది.

ధనుస్సంక్రమణం..

సామాన్యంగా పెద్దలు చెప్పేది మంచు విపరీతంగా మార్గశిరమాసంలో కురుస్తుంది. కాబట్టే, దాన్ని హేమంతఋతువు అన్నారు. ఆ ఋతువులో మనుష్యులు మంచుకు తడిసి, చలికి గడగడ వణుకుతూ వీపు విల్లులాగా వంగిపోగా ఒక మూల ముడుచుకొని పడుకొంటారు.

dhanurmasam

సోమరులై, నిద్రపోతుంటారు. అలాంటివారు. తెల్లవారు జామున నిద్రలేచి, స్నానంచేసి, విష్ణుదేవాలయానికి వెళ్లాలనే సంకల్పం కల్గి ఉండడం సాధ్యమా? అందుకే, విల్లులా వంగిపోయిన మానవునివార్ధక్యదశకు సంకేత నామమే ‘ధనుర్మాసం’ అంటారు పెద్దలు. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించేమాసం ధను ర్మాసం. దీన్నే ధనుస్సంక్రమణం అంటారు.

ధనుర్మాస సందేశం..

ప్రకృతిలోని సహజవాతావరణ లక్షణాలకు, ద్వంద్వా లకు భయపడి నిద్రపోకుండా జీవుడు ‘ధీరుడై’ మోక్షగామి. కావాలనేదే ధనుర్మాస సందేశం! (ఆధ్యాత్మికయోగసాధకుడినే ‘ధీరు’డంటారు.)

తిరుప్పావై..

సూర్యుడు ధనూరాశిలో నుంచి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం.

హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు.

ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్త్భివనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు.

‘తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది. అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది.

dhanurmasam

ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగా శివభక్తిని రసప్రవాహంగా తిరువెంబావైని మాణిక్యవాచకులు అనుగ్రహించారు.

గోదాదేవికి ఆండాళ్ అనే పేరు ఉంది. శ్రీవిల్లిపుత్తూర్ క్షేత్రంలో విష్ణుచిత్తులకు (పెరియాళ్ళార్) తులసివనంలో దొరికిన భూదేవి ప్రతిరూపం.

అల్లారుముద్దుగా పెరిగింది. పిన్ననాటనే విష్ణ్భుక్తిని పెంపొందించుకుంది. యుక్త వయస్సు రాగానే భర్తగా పెరుమాళ్ళనే పొందాలనుకుంది.

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోపికలు చేపట్టిన కాత్యాయిని వ్రత విధానాన్ని తండ్రి ద్వారా తెలుసుకుని గోదాదేవి మార్గళి (శ్రీవ్రతాన్ని) ఆచరించడానికి సంకల్పించింది.

శ్రీ విల్లిపుత్తూరును వ్రేపల్లెగా, వటపత్రశాయిని (శ్రీకృష్ణునిగా) భావించి కట్టుబొట్టులతో గొల్లపడతిగా తనను రూపుదిద్దుకుని, నెచ్చెలులను గోపికలుగా, నందకిశోరుని మేల్కొల్పడానికి ఉద్యుక్తురాలైంది.

dhanurmasam

నందుని ఇంటికి చేరడానికి వీలుగా, రోజుకొక పాశురం ఆలపిస్తూ నందకిశోరుని కీర్తిని గానం చేసింది. ఈ పాశురాలలో భక్తితోపాటు హాస్యము లాస్యము చోటుచేసుకున్నాయి. పాశురాలన్నీ దివ్యప్రబోధాలు. బ్రహ్మానంద తరంగాలు.

మోక్షసౌధాన్ని చేరే సోపానాలు. ‘నాలాయిరం’ అనే విష్ణ్భుక్తియుతమైన దివ్యప్రబంధానికి హృదయంగా తిరుప్పావై సుస్థిరస్థానం సంపాదించుకుంది.


తిరువెంబావై మాణిక్యవాచకుల శివభక్తికి స్పందన. మధురైకి సమీపంలోని తిరువాదపూర్ వీరి జన్మస్థలం. మాణిక్యవాచకులు పాండ్యరాజుల కొలువులో ఉండేవారు. వీరి జీవితం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.

తెలుగు నాట రామదాసువలె, రాజాజ్ఞను ధిక్కరించడం చేత కఠిన కారాగారవాసం చేశారు. రాజు తన తప్పు తెలుసుని వాచకులకు విముక్తి కలిగించడమే కాక తాను కూడా పరమ శివభక్తుడయ్యాడు.


ధనుర్మాసంలో శివాలయాల్లో మేలుకొల్పుగా పాడే తిరువెంబావై ముప్ఫది పాశురాల సంపుటి. రెండు భాగాలుగా ఉంటుంది. తిరువణ్ణామలైలో ఇరువది పాశురాలను, తిరుప్పెతుందరై క్షేత్రంలో పది పాశురాలను గానం చేశారు తిరువాచకులు.

వీటిని తిరువెంబావై, తిరుప్పళి పొళుచ్చి అని వరుసగా పిలుస్తారు. నాలాయిరంలో తిరుప్పావై వలె ఇవి తిరువాచకం అను శివభక్తి రసప్రధానమైన తమిళ కావ్యంలో సుస్థిర స్థానంపొందాయి.

dhanurmasam


శివభక్తులు (అర్చకులు) ధనుర్మాసంలో తిరువెంబావై సుప్రభాత వేళ గానం చేస్తారు. తిరుప్పావై వైష్ణవ ఆలయాల్లో సుప్రభావం బదులు పాడతారు. రెండూ ఒకే విధమైన భక్తిని ప్రకటిస్తాయి.

తిరుప్పావైలో ప్రకృతి సౌందర్యం, శృంగార భక్తిని ప్రకటిస్తే, తిరువెంబావైలో ధ్వని చిత్రాలు హృదయాలను రంజిల్లి చేస్తాయి. అందువల్ల ఈ వ్రతాలను ఆచరించేవారి చేష్టలలో చాలా పోలికలున్నాయి. తిరుప్పావైలో అమలిన శృంగారం మనస్సులను దోచుకుంటే, తిరువెంబావైలో తత్త్వవివేచన హృదయాలను హత్తుకుంటుంది.


ఈ రెండూ మేలుకొలుపు పాటలే అనడానికి తార్కాణంగా రెండు సంపుటులలో ఎనిమిది పాదాల పాశురాలలో చివరి పాదంలో ‘ఏలోరెంబావై’ అను పదంతో ముగియడం. అంటే మేలుకో అని అర్థం.


తిరుప్పావైలోని ప్రేమ, భక్త్భివాలను, తిరువెంబావైలోని తాత్త్విక చింతనను, అవి వర్ణించిన చిత్ర విచిత్ర దృశ్యమాలికలను, కవితా మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభతిని పొందాలంటే ఈ రెండు అమూల్య గ్రంథాలను పఠించి జన్మలను సార్థకం చేసుకోవడం అభిలషణీయం.