Fri. Mar 29th, 2024
MLABHATTI

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం, జనవరి 27,2023: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రాజులదేవరపాడు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఘనంగా పూజలందుకొని మామునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క రిపబ్లిక్ డే సందర్భంగా హాత్సేహాత్ జోడో యాత్రను ప్రారంభించారు.

దేశ ప్రజల అందరికి సమానమైన హక్కు, ఆత్మగౌరవాన్ని కల్పించిన భారత రాజ్యంగానికి కేంద్రంలోని బిజెపి పాలకులు తూట్లు పొడుస్తు న్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా భారత రాజ్యాంగాన్ని రూపొందించకుంటే సామాన్యుని పరిస్థితి ఏంటి..? అని ఆయన అన్నారు.

MLABHATTI

ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉద్దేశ్యాన్ని, విభజన రాజకీయాలతో దేశంలో రాజాకీయ లబ్ధి పొందాలని మతం పేరిట బిజెపి చేస్తున్న దుశ్చర్యలను వివరించారు.

ఆనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశ ప్రజలందరికి సమానమైన అవకాశాలు కల్పించాలని, ప్రజలు అందరు సమానంగా ఎదుగాలని, దేశ ప్రజలు మొత్తం ఒక జాతిగా ఎదిగి ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడాలన్న మంచి ఉద్దేశ్యంతో ఈ దేశానికి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అందించిందని అన్నారు.

కానీ ఆనేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, లౌకిక వాదాన్ని పక్కన పెట్టి, మతం పేరిట ప్రజలను విడగొట్టి, ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్యన వైషమ్యాలను పెంచుతూ, రాజకీయ లబ్ధి పొందడానికి రక్తపాతానికి బిజెపి నాయకులు సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యకం చేశారు.

బిజెపి విచ్చిన్నకర రాజకీయాలతో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తున్న దని, ఈనేపథ్యంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా రాహుల్ గాంధి దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని నిలబెట్టడానికి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా

లెక్కచేయకుండ దేశ ప్రజల బాగు కొరకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.

MLABHATTI

రాహుల్ గాంధీ యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రతి అడుగులో ప్రజలు భాగస్వామ్యం అయ్యారని వెల్లడించారు. రాహుల్ చేపట్టిన భారత్ జూడో యాత్రకు కొనసాగింపుగానే రెండు నెలలపాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించి బిజెపి పరిపాలనకు చరమగీతం పాడనున్నారని తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ దేశ సంపదను గుజరాతీ కార్పొరేట్లకు దోచి పెట్టే పనిలోనే ఉన్నారని విమర్శించారు. కాయ కష్టం చేయకుండ అంబానీ, ఆధానీలు లక్షల కోట్లు ఎట్లా సంపాదించారని ప్రశ్నించారు.

8సంవత్సరాల క్రితం సామాన్య వ్యాపార వేత్తగా ఉన్న ఆధానీ ప్రపంచంలో రెండవ కుభేరుడుగా ఎదగడం వెనుక దేశ సంపదను ప్రధానీ మోడీ అతనికి దోచి పెట్టడం వల్లనే సాధ్యమైందన్నారు.

కేంద్రంలోని బిజెపి పాలకులు కార్పోరేట్లకు దేశ సంపదను దోచి పెట్టడం వల్ల ప్రజల మధ్యన ఆర్ధిక ఆసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నవాడు సంపన్నులు,లేని వాడుగా దేశం రెండుగా విభజించపడుతోందని ఇది దేశానికి మంచిది కాదన్నారు.

MDR_MLABHATTI

పీపుల్స్ మార్చ్, హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తు గురించి ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

విద్య, వైద్యం, ఇండ్లు, ఇంటి స్థలాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి, మౌలిక వసతి తదితర సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కారించాలని ప్రజల గొంతుకగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తానని వెల్లడించారు.

ప్రభుత్వం ప్రతి ఏటా ప్రవేశపెట్టేటువంటి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజా సమస్యలు తీర్చేవిగా ఉండాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అసెంబ్లీ వేదికగా ప్రభుతంపై ఒత్తిడి పెంచుతానని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధిర కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కొనాధని కుమార్, చిట్టిబాబు, బండారు నరసింహారావు, అనుమొలు వెంకట కృష్ణారావు, కడియం శ్రీనివాసరావు పురుషోత్తం,దేవరకొండ శ్రీనివాసరావు, నాగిరెడ్డి,ఎఐసిసి మెంబర్ ప్రతాపరెడ్డి,బాబురావు శ్రీనివాసరావు, రాజేష్ తదితరులు ఉన్నారు.