365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 18, 2023: హైదరాబాద్ లో అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశ్వనీయంగా అందిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు పది రామచిలుకను ద్వి చక్ర వాహనంపై తరలిస్తుండగా అటవీ శాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది.
షాద్ నగర్ లో వీటిని కొని, హైదరాబాద్ తరలిస్తుండగా ఆరామ్ ఘర్ దగ్గర అహసుద్దీన్, సయాద్ బుర్హానుద్దీన్ ల నుంచి అటవీశాఖ స్వాధీనం చేసుకుంది.
వైల్డ్ లైఫ్ చట్టం1972 ప్రకారం ఈ రకమైన రామచిలుకలను వేటాడటం, వెంట ఉంచుకోవటం నేరమని పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు.
అధికారుల విచారణలో వీటిని 25 వేల రూపాయలకు అమ్మేందుకు తరలిస్తున్నామని పట్టుబడిన ఇద్దరు నిందితులు తెలిపారు. ఈరకమైన వ్యాపారం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న చిలుక పిల్లలను నెహ్రూ జూ పార్క్ కు తరలించి సంరక్షించాలని పీసీసీఎఫ్ ఆదేశించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, హైదరాబాద్, యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శంషాబాద్, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.