365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,నవంబర్ 25,2021: తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, ఇతర సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, ఎస్వీబీసీ రేడియో, ఎస్వీ ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రసారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆకాశవాణి ద్వారా ఈ ప్రసారాలను నిలుపుదల చేయించినట్టు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. 2018లో టిటిడి ఆకాశవాణితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవారి ఆలయంలో జరిగే సేవలను ప్రసారం చేసేందుకు గాను ఆకాశవాణికి ఏడాదికి రూ.35 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది.
టిటిడికి సొంత ఛానల్, ఎఫ్ఎం రేడియో ఉన్నందువల్ల ఆకాశవాణిలో ఈ ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిటిడి ఎఫ్ఎం రేడియో, ఎస్వీబీసీ రేడియోలో శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన ఇతర సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతోంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినాలని కోరడమైనది.