Fri. Mar 29th, 2024
Balagam-movie

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 24,2023:తెలంగాణ పల్లె సంస్కృతి ని అద్భుతంగా ఆవిష్కరించిన బలగం సినిమా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం అన్నారు.

హైదరాబాద్ మాసబ్​ట్యాంక్​లోని ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బలగం సినిమా బృందానికి అభినందన సభ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం చిత్రంలోని నటీనటులు, యూనిట్‌ సభ్యులను, దర్శక నిర్మాతలను శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేసి, ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుండి మమ్మల్ని ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎండీ అరవింద్ కుమార్ ఐఏఎస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా అనిల్ కుర్మాచ‌లం మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని, తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ను ప్రారంభించిన నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డిలను అభినందించారు.

బలగం సినిమాను చూసిన ప్రతిఒక్కరు తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా దర్శకుడు వేణు చూపించారని అన్నాడు.

సినిమాలో కంటెంట్ ఉంటే ప్రజలు ఆదరిస్తారని దానికి బలగం సినిమా ఒక ఉదాహరణని అన్నారు. తెలంగాణ సినిమా ఎంతో ముందుకు వెళ్లాలని అందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించడానికి కృషి చేస్తామని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్ సినిమాలకు మంచి ఆదరణ ఉందని, కానీ తెలుగులో చిల్డ్రన్ సినిమాలు రావడం తగ్గిందని, మంచి కథలలో సరికొత్త చిల్డ్రన్ సినిమాలను తీయడానికి దర్శక నిర్మాతలు ముందుకురావాలని అందుకు ఎఫ్‌డీసీ తరపున సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ సినిమారంగ అభివృద్ధికి ఒక పాలసీలను తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు.

తెలంగాణ సినిమా ఎంతో ముందుకు వెళ్లాలని అందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించడానికి కృషి చేస్తామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఎఫ్‌డీసీ సిబ్బందిని అభినందించారు.

నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ… ప్రభుత్వం తరపున ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో బలగం సినిమాకు సత్కారం జరగడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

దర్శకుడు వేణు మాట్లాడుతూ… దర్శకుడిగా తొలి సినిమానే ఇంత విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని, చిన్న సినిమాగా మొదలై, పెద్ద విజయం సాధించడంలో ప్రతిఒక్కరి పాత్ర ఉందని, వారందరి సహకారంతోనే ఇది సాధ్యమయిందని అన్నారు.

తెలంగాణ ఎఫ్‌డీసీ నుండి తొలిసారిగా బలగం సినిమా సత్కరించినందుకు ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారికి, మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ సిబ్బంది డి. విజయ్, సంజీవ్ కుమార్, దేవ్ సింగ్, నిర్మాతలు దిల్‌ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్‌ రెడ్డి, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ కావ్య, పాటల రచయిత శ్యామ్ కాసర్ల, గాయకురాలు మంగ్లీ, సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు, ఎడిటర్‌ మధు, నటులు రచ్చ రవి, రూప లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.