Wed. Apr 17th, 2024
Jagananna-township365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జనవరి31, 2023: మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలనే బృహత్తర ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) ఆధ్వర్యంలో తాడేపల్లి -మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరులో ఏర్పాటు

చేసిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ మధ్య తరగతి ఆదాయ సమూహం (ఎంఐజి) ఫేజ్-2 లే అవుట్లో 22 ప్లాట్లకు ఈ-లాటరీ నిర్వహించి అర్హులైన వారికి ప్లాట్లను కేటాయించినట్లు ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.

ఎంఐజీ లే అవుట్లో తొలి విడతలో 25.06.2022న 102మందికి, రెండో విడతలో 05.07.2022 తేదీన మరో 17మంది అభ్యర్థులను ఈ-లాటరీ ద్వారా ఎంపిక సంస్థ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్ రాండమ్ లాటరీ తీసి ప్లాట్ల కేటాయింపు ధృవీకరణపత్రాలను అందజేయటం జరిగిందని తెలిపారు.

Jagananna-township365

తాజాగా ఎంఐజీ లే అవుట్ ఫేజ్-2లో 31.01.2023 తేదీ మంగళవారం నాడు మూడో విడతలో మరో 22 మంది లబ్దిదారులకు విజయవాడ లెనిన్ సెంటర్లోని సీఆర్డీఏ కార్యాలయంలో ఆన్లైన్ రాండమ్ ఈ-లాటరీ తీసి ప్లాట్ల కేటాయింపు ధృవీకరణ పత్రాలను అందజేయటం జరిగిందని వెల్లడించారు.

ఇందులో సాధారణ ప్రజలు 240 గజాల కేటగిరీలో -11 ప్లాట్లు, 200 గజాల కేటగిరీలో -11 అర్హులు ప్లాట్లను పొందారు. ఈ కార్యక్రమంలో సంస్థ అదనపు కమిషనర్ షేక్ అలీం బాష, ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్రాజు, తహసీల్దార్ కె.నాగలక్ష్మి, ఐటీ ప్రాజెక్టు మేనేజర్ ఎం.లక్ష్మీ ప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు.

అభ్యర్థులు ప్లాట్లు ఎలా పొందాలి..?

ఈ -లాటరీ ద్వారా ధృవీకరణ పత్రాలు పొందిన అభ్యర్థులు నెల లోపుగా అగ్రిమెంటు చేయించుకోవాలి. అగ్రిమెంటు చేసుకున్న నెలలోపు 30 శాతం వాయిదాను చెల్లించాలి. ఆరు నెలల లోపు మరో 30 శాతం నగదును చెల్లించాలి.

ఏడాది లోపుగా మరో 30 శాతం వాయిదాను చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మొదటి నెలలోనే మొత్తం వాయిదాను చెల్లించిన అభ్యర్థులకు 5శాతం రాయితీ ఇవ్వటంతో పాటు ప్లాట్ రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యం కల్పించనున్నారు.

సీఆర్డీఏ ఎంఐజీ లే అవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో చక్కటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గతేడాది జనవరి 11వతేదీన ఎంఐజి లే అవుట్ను ప్రారంభిచినట్లు కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు.

Jagananna-township365

ఈ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆమోదించిన ఈ లే అవుట్ కు ఏపీరెరా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

లే అవుట్లో మౌలికసదుపాయాల అభివృద్ధికి సీఆర్డీఏ చర్యలు చేపట్టడమైన దని తెలియజేశారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ(యూజీడీ) నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో చేపట్టామని తెలిపారు.

60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతో పాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు.

వీటితో పాటు కాలిబాటలు, ఎస్టీపీలు, వర్షపు నీటి డ్రెయిన్లు, ఆహ్లాదాన్ని అందించే అందమైన ఉద్యానవనాలు, పచ్చదనం అభివృద్ధి, వీధి దీపాలు లాంటి ప్రజా జీవనానికి సౌకర్యవంతమైన పనులు చేపడుతున్నామన్నారు.

రానున్న రోజుల్లో ఏపీసీఆర్డీఏ పరిధిలోని 26 నియోజకవర్గాలలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ఇప్పటి వరకు ఆరు నియోజకవర్గాల పరిధిలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా వాటిని రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించామని ఆయన తెలిపారు.