Tue. Apr 16th, 2024
mobsters

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్11, 2022: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న125 మందిని రాచకొండ పోలీసులు, ‘షీ టీమ్స్‌’ పట్టుకున్నారు. 28 ఎఫ్ఐ ఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు)లతో సహా 91 కేసులు బుక్ చేశారు. రాచకొండ వ్యాప్తంగా ఉన్న మెట్రో రైళ్లు, స్టేషన్లు, బస్టాప్‌లు, పని ప్రదేశాలు, కళాశాలల నుంచి నేరుగా, వాట్సాప్‌ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని షీ టీమ్స్‌ అధికారులు తెలిపారు.

పట్టుబడిన నిందితులు ఎల్‌బి నగర్‌లోని పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో శిక్షణ పొందిన కౌన్సెలర్లు ,ప్రొఫెషనల్ సైకాలజిస్టులు నిర్వహించిన కౌన్సెలింగ్ సెషన్‌లకు హాజరయ్యారు. మహిళలను వేధించినందుకు పాఠశాల ఉపాధ్యాయుడు సహా పట్టుబడిన125 మందిలో 74 మంది మైనర్లు ఉన్నారని, వారికి సీనియర్ సైకాలజిస్టులు కౌన్సెలింగ్ ఇచ్చారని అధికారులు తెలిపారు.

mobsters

కుషాయిగూడ, చౌటుప్పల్, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఎల్‌బి నగర్, మల్కాజ్‌గిరి, వనస్థలిపురంలో చేపట్టిన ఆపరేషన్లలో పలువురు మైనర్‌లతో సహా దాదాపు 100 మంది పట్టుబడ్డారు. మెట్రో రైళ్లలో డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి, మహిళల కోసం కేటాయించిన కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశించిన12మందికి జరిమానాలు విధించినట్లు నిర్ధారించింది షీ టీమ్స్.

గత ఆరు వారాల్లో మూడు బాల్య వివాహాలను షీ టీమ్స్ అడ్డుకున్నాయని, ఇప్పటి వరకు కమిషనరేట్‌లో 155 బాల్య వివాహాలు జరిగాయని అధికారి తెలిపారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై రాచకొండ పోలీసులు, స్వయం సహాయక సంఘాల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

mobsters

రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ షీ టీమ్స్ ను అభినందించారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నంబర్ – 9490617111 లేదా డయల్ 100 ద్వారా షీ టీమ్‌లను సంప్రదించాలని కోరారు.