Wed. Mar 27th, 2024

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి23, హైదరాబాద్ :అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్ కి అద్భుత స్పంద‌నవ‌చ్చింది. “ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే“ అంటూ సాగే మెలోడీ పాటను

`బుట్టబొమ్మ‌` పూజా హెగ్డే చేతుల‌మీదుగా వేలెంటైన్స్ డే రోజున విడుద‌ల చేయ‌గా ఫీల్ గుడ్సాంగ్ అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.
ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో ఓ ఆస‌క్తి క‌ర‌ సంగ‌తిని నిర్మాత ఆనంద ప్ర‌సాద్ వెల్ల‌డించారు. ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ-“ఈ పాట‌ను అమ‌లాపురం, కాకినాడ ప‌రిస‌రాల్లో చిత్రీక‌రించాం. పాట చిత్రీక‌ర‌ణ‌లో ఓ త‌మాషా ఉంది. మూవీలో స‌న్నివేశం మూడ్ కి త‌గ్గ‌ట్టుగా అక్కడ లొకేష‌న్ల‌లో విజువ‌ల్స్ ని తెర‌కెక్కించాం. తొలుత‌ విజువ‌ల్స్ షూట్ చేశాకే హైద‌రాబాద్ లో ట్యూన్ క‌ట్టాం. ఇలా ఇంత‌కుముందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ `లేడీస్టైల‌ర్` కోసం ”ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే ” పాటలో ప్ర‌యోగం చేశారు. విజువ‌ల్స్ షూట్ చేసాక ఇళ‌య‌రాజాతో ఆ బాణీని సిద్ధం చేయించారు వంశీ గారు. ఆ తరహాలోనే మేం చేసిన ప్ర‌యోగం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుందని భావిస్తున్నాం. మార్చి 6న సినిమాని రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. “ఒక విలేజ్‌లో జరిగే క‌థ‌ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను క‌లిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొన‌సాగుతుంది. ట్విస్టులు థ్రిల్‌ కలిగిస్తాయి. స్క్రీన్‌ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం“ అని అన్నారు.

నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు.. సాంకేతిక నిపుణులు: పాటలు: శ్రీజో , ఆర్ట్: వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.