365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమల,జూన్ 7,2021 : చూశాను సీతాదేవిని అంటూ హనుమంతుడు అత్యంత సమయస్ఫూర్తితో సీతమ్మ జాడను శ్రీరామునికి తెలియజేశారని, హనుమ వాగ్వైభవానికి ఇదే నిదర్శనమని ప్రముఖ పండితులు డా. పివిఎన్ఎన్.మారుతి తెలియజేశారు. తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నాదనీరాజనం వేదికపై ” హనుమంతుని వాగ్వైభవం ” అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ మారుతి ఉపన్యసిస్తూ వాక్కు మనిషికి అలంకారమని, ఇలాంటి మధురమైన వాక్పటిమ హనుమంతుని సొంతమని చెప్పారు. దేవతలు సైతం హనుమంతుని వాగ్వైభవాన్ని ప్రశంసించారని తెలిపారు. లోకకల్యాణం కోసం రామాయణంలో హనుమంతుడు వ్యవహరించిన తీరు అద్వితీయమని, సందర్భానుసారం ఆయన మాటలతో రామకార్యాన్ని సఫలీకృతం చేశారని అన్నారు. కిష్కిందకాండలో వానరరాజ్యానికి వచ్చిన రామలక్ష్మణుల పరిచయం, వారికి ఆహ్వానం పలకడం, సీతాన్వేషణ కోసం నడుం బిగించడం, మైనాకుడి ప్రశంసను సైతం తేలిగ్గా తీసుకుని రామకార్యం కోసం బయలుదేరడం, సురస, సింహిక, లంకిణి వంటి భయంకరమైన రాక్షసులను దాటుకుని ముందుకెళ్లడం, లంకలో సీతమ్మ జాడను కొనుగొని ఆమెకు విశ్వాసం కలిగేలా రామకథాగానం చేయడం, ఆయన మాటలతో రావణాసురుడిని మానసికంగా ఓడించడం తదితర ఘట్టాల్లో సందర్భానుసారం హనుమంతుని మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. రామకార్యం కోసం ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలో హనుమంతునికి బాగా తెలుసన్నారు.
ఆకాశగంగ తీర్థం వద్ద…
హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం ఆకాశగంగ తీర్థం వద్ద ఆంజనేయస్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీమతి లావణ్య బృందం హనుమత్ సంకీర్తన లహరి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
జాపాలి క్షేత్రంలో…
జాపాలి క్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ పిఎస్.రంగనాథ్ బృందం హనుమాన్ చాలిసా పారాయణం చేశారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు పురందరదాస రచించిన హనుమత్ సంకీర్తనలను ఆలపించారు.